తెలుగు వీర లేవరా…”ఆ మరణ దీక్ష ” చేయరా…. !

తెలుగు వీర లేవరా…”ఆ మరణ దీక్ష ” చేయరా…. !

Image

బెంగాలీ వాళ్లు ఇవాళ ఆలోచించింది.. మిగతా దేశమంతా రేపు ఆలోచిస్తుంది…అనేవాళ్లు ఒకప్పుడు.
దానిని కొద్దిగ సవరిస్తే ‘తెలంగాణ వాళ్లు నిన్న ఏం చేశారో సీమాంధ్ర వాళ్లు ఇవాళ అది చేస్తారు’ అనొచ్చేమో.

వంటావార్పులు, గర్జనలు, మార్చ్‌లు, విగ్రహాల విధ్వంసాలు, ధూమ్‌ధామ్‌లు, సకల జనుల సమ్మెలు వగైరాలన్నీ అయిపోయి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలు కూడా మొదలవడమే అందుకు నిదర్శనం.

కాకపోతే ఇక్కడ ఉక్కు పాదాలు, లాఠీలు, టియర్‌ గ్యాసులు, రబ్బర్‌ బుల్లెట్లు, అరెస్టులు, క్రిమినల్‌ కేసులు, నిషేధాజ్ఞలు, ప్రభుత్వమే రైళ్లను బస్సులను రద్దు చేయడాలు, బైండోవర్లు, మీటింగులకే కాదు శవయాత్రలకు సైతం పర్మిషన్ల నిరాకరణలు వంటివి అడుగడుగునా ఎదురైతే… అక్కడ ఏలినవారి ఆశీస్సులవల్ల నిరాటంకంగా, ఇస్త్రీ బట్టలు నలగకుండా భారీ సెట్టింగులతో సినిమా షూటింగ్‌ చేస్తున్నంత కోలాహలంగా ఉద్యమం సాగుతోంది.
ఇప్పుడిక ఆమరణ దీక్షల పర్వం కూడా మొదలయింది.

కెసిఆర్‌ ఆమరణ దీక్షతో తెలంగాణా ఉద్యమం శిఖరాగ్రం చేరుకుంది.
ఆయనను ఆమరణ దీక్షకు అసలు కూచోనివ్వనేలేదు.
సిద్దిపేటలోని దీక్షాస్థలానికి బయలుదేరిన వెంటనే ఆయనను కరీంనగర్‌లోనే అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి ఆఖరికి ఖమ్మం జైల్లో పడేశారు.

గాంధీ చూపిన మార్గంలో నిరాహార దీక్ష చేసే హక్కును కెసిఆర్‌కు ఎందు నిరాకరించారో ఇప్పటికీ అర్థం కాదు.

ఆయన స్థానంలో హరీష్‌రావు సిద్ధిపేటలో నిరాహార దీక్షకు కూచోబోతే ఆయనను కూడా అరెస్టు చేశారు.
పోలీసులు తనను అరెస్టు చేయడానికి దగ్గరకొస్తుంటే పెట్రోల్‌ బాటిల్‌ చూపించి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని  బెదిరించినందుకు ఆయనను తీవ్రంగా విమర్శించారు.
కొన్ని గ్రామ సింహాలు ”తగులబెట్టుకోడానికి హరీష్‌రావుకు అగ్గిపుల్లే దొరకలేదా” అని ఎకసక్కెం చేశారు.
కానీ ఒక్కడైనా తెలంగాణా నేతలకు శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే హక్కు కూడా లేదా
వాళ్లని ఎందుకు అరెస్టు చేశారు,
ఇదేం ప్రజాస్వామ్యం?”
అని మాత్రం ప్రశ్నించలేదు.

ప్రభుత్వ నిఘాలో వుంటూ, జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను
నానా రకాలుగా, దుర్మార్గంగా,  అవహేళన చేశారు.

కానీ ఇప్పుడు చూడండి…

సీమాంధ్రలో ఎంతమంది
ఎన్ని జిల్లాల్లో ఎంతెంతమంది ఎన్నెన్ని ఆమరణ దీక్షలు
ఎంత స్వేచ్ఛగా చేసేస్తున్నారో….!

ఒక నేత ఒక్క నెలలోనే సమన్యాయం కోసం ఒకసారి,
సమైక్యత కోసం మరొకసారి ఇలా రెండు సార్లు ఆమరణ దీక్షలు చేయడం నిజంగా న భూతో న భవిష్యతి!

అబద్ధపు వాగ్దానాలు, మాట తప్పటాలు మడమ తిప్పటాలు. యూ టర్న్‌లు. పి టర్న్‌లు, ఎస్‌ టర్న్‌లు…
ఇవేం నాయకత్వ లక్షణాలో అర్థం కాదు.

ఇంకొక నేత అయితే ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియక నేషనల్‌ మీడియా జుట్టు పీక్కుంది.

ప్రజలు…ప్రజాభిప్రాయం…ప్రజాస్వామ్యం అని తెగ డైలాగులు చెబుతున్న వారి కంటికి
తెలంగాణా ఉద్యమం ఉద్యమంగా, తెలంగాణా ప్రజలు ప్రజలుగా, తెలంగాణా ప్రజల అభిప్రాయం ప్రజాభిప్రాయంగా,
తెలంగాణా ప్రజల హక్కులు ప్రజాస్వామిక హక్కులుగా కనిపించకపోవడం శోచనీయం కాదా.

ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి
ఈ హిపోక్రసీ నుంచి, ఈ జిత్తులమారి రాజకీయలనుంచి
రెండు ప్రాంతాల ప్రజలకు నిజమైన విముక్తి లభించాలి !

This entry was posted in Telangana and tagged , , , . Bookmark the permalink.

4 Responses to తెలుగు వీర లేవరా…”ఆ మరణ దీక్ష ” చేయరా…. !

  1. Problem of hypocrisy does not disappear but it gets reduced..
    What matters is whether the respective have a good plan to shape their destiny and will they make it a transformative, inclusive yet speedy development for all the peoples aspirations ..
    Wish the impasse ends soon and all move forwards with speed..

  2. రాష్ట్ర పభుత్వ యంత్రాంగ వెన్నుదన్నుతో ముఖ్యమంత్రి కనుసన్నలలో మీ హైదరాబాద్ లో మాకు కూడా భాగం కావాలని పనికట్టుకొని జరిపించిన ఉద్యమం సీమాంధ్ర ఉద్యమం!ఇనుప కంచెలతో,పోలిసుల టియర్ గ్యాస్ తో ,లాటీచార్జులతో,పెనుభీకరంగా,బీభత్సంగా నిత్య రక్తసిక్త౦గా జరిగిన కడుపుమండిన ఉద్యమం తెలంగాణా ఉద్యమం!అదీ తేడా!

  3. bonagiri says:

    ఆమరణ దీక్షలు లాంటివి స్వాతంత్ర్య పోరాటం నాటి కాలంలో చేసినా అర్థం ఉంది కాని, ఈ ఆధునిక యుగంలో, ప్రజాస్వామ్య దేశంలో చేయడంలో అర్థం లేదు. ఈ దీక్షలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకున్నా, ఒక వ్యక్తి తన శరీరాన్ని హింసించుకుంటూ, నిరవధికంగా నిరాహారదీక్ష చేయడం అమానుషం కాదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? అందుకే ఆమరణ (లేదా నిరవధిక) నిరాహారదీక్షలని నిషేధించాలి.

Leave a comment