తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఆంధ్ర జ్యోతిలో (25 10 2013న) రాసిన ఆద్భుత వ్యాసం
తప్పక చదవండి … చదివించండి … చదివి ఆలోచించండి !
అబద్ధంవా.. సుబద్ధంవా…
– తిగుళ్ల కృష్ణమూర్తి
2014 దాకా విభజనను ఆపాలని సీమాంధ్ర నాయకులు కోరడంలోనే, అప్పటికి ఎన్నికల్లో గెలిచి, పబ్బం గడుపుకుందామనే ఎత్తుగడ దాగి ఉంది. 2014 దాకా విభజనను ఆపుతామని, తర్వాత గ్యారెంటీ లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇంతోటిదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇన్ని అబద్ధాలతో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం ఎందుకు? ఎన్నటికైనా తప్పని విభజనను ఎప్పుడో ఒకసారి కానిస్తే పోలా?!
మోసపోవడం ఒక బలహీనత.
మోసం చేయడం ఒక అవసరం.
ఈ అవసరాన్ని అలవాటుగా మార్చుకున్న వారు ‘ఫలానా వారిని’ మాత్రమే మోసం చేస్తారనే రూలేం లేదు. మోసకారులకు స్వపర భేదాలుండవు, స్వార్థం తప్ప!
రాష్ట్ర విభజన అంశంలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలు, ఆటలు ఒక్కసారి గమనించండి.
వెయ్యేళ్లయినా ఈ రాష్ట్రం విడిపోదని జాతీయ జెండా సాక్షిగా ప్రకటించారు.
విభజన ప్రకటన వచ్చింది.
దేవుడు కూడా తెలంగాణ ఇవ్వలేడన్నారు.
సోనియా ఇవ్వాలని నిర్ణయించింది.
అది పార్టీ నిర్ణయం మాత్రమే అన్నారు.
యూపీఏ తీర్మానం చేసింది.
తమ రాజీనామా బెదిరింపుతో ప్రక్రియ ఆగిపోయిందన్నారు.
కేబినెట్ నోట్ రెడీ అయింది.
విభజనపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు.
జీవోఎం ఏర్పాటైంది.
ఇక ముందుకు కదలదని శాసించారు. రాష్ట్రం నుంచి సమాచార సేకరణ మొదలైంది. విభజన తీర్మానం అసెంబ్లీ పరిశీలనకు వస్తుందన్నారు. తీర్మానం ఉండదని షిండే, డిగ్గీరాజా ప్రకటించారు. వారట్లా జరగదని అనడం.. రోజులు గడవక ముందే అక్షరం పొల్లుపోకుండా అదే జరిగిపోవడం. దీన్ని వాక్శుద్ధి అనాలా? వంచనా శిల్పం అనాలా?
ఏపీ ఎన్జీవో నేత అశోక్బాబు అన్నట్టు ‘రాజ్యాంగం తెలియని వారు’ నాయకులు కావడం మన దురదృష్టం. ఇంత జరిగిన తర్వాత కూడా సదరు సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థంకాదు.
వారేమంటున్నారు? అసెంబ్లీలో బిల్లు ఓడిపోతుంది. దాంతో విభజన ప్రక్రియ ముందుకు సాగదు. దీంతో సోనియా పార్లమెంటుకు బిల్లు పంపడానికి సిగ్గుపడుతుంది. పంపినా మద్దతివ్వడానికి బీజేపీ భయపడుతుంది. మద్దతిచ్చినా సంతకం పెట్టడానికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ జంకుతారు. ఆయన ఆపకుంటే తామే ఆర్టికల్ 371డిని అడ్డుపెట్టి, సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటాం! ఇదీ వారి తర్కం.
తెలంగాణకు మెజారిటీ లేని, రప్పించడం ఎన్నటికీ సాధ్యంకాని ఉమ్మడి అసెంబ్లీలో తీర్మానమో, బిల్లో గెలిచే అవకాశాలు అతి తక్కువ అన్న సంగతి విభజనకు నిర్ణయించిన సోనియాకు, మన్మోహన్కు ముందు తెలియదనుకోవాలా?
అయినా వాళ్లు ముందుకు వెళ్లడానికి కారణం.. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయానికి విలువ నామమాత్రం కావడమే. అది అనుకూలమైనా, ప్రతికూలమైనా దాన్ని పట్టించుకోవాల్సిన నిమిత్తం కేంద్రానికి ఎంతమాత్రం లేదు. సీమాంధ్ర నేతల కన్నా మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివైన వారు.
అన్ని విషయాలకూ ‘మెజారిటీ’ అభిప్రాయాన్నే ప్రాతిపదికగా చేస్తే, ఈ దేశంలో ‘కుల, మత, ప్రాంతీయ మైనారిటీ’ల కోరికలు ఎన్నటికీ తీరవు. వారికి హక్కులివ్వడానికి మెజారిటీ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఆయా సందర్భాల్లో మెజారిటీ అభిప్రాయానికన్నా న్యాయాన్యాయాల విచక్షణకే పెద్దపీట వేశారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాగూ ఓడిపోయే బిల్లు, ఓడిపోయినప్పుడు సోనియా సిగ్గుపడి, మనసు మార్చుకుని వెనకడుగు వేస్తుందా?
ఇక పార్లమెంటులో బీజేపీ సంగతి. ఈ దేశంలో ఎంతోకొంత మాటకు కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ. సదరు నాయకుల్లా పూటకో మాట మార్చే అలవాటు, అవకాశం జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఉండవు. చిన్న రాష్ట్రాలను పార్టీ విధానంగా తీసుకున్న బీజేపీ, తెలంగాణపై నిర్ణయాన్ని మార్చుకోవాలంటే సంఘ్ నుంచి మొదలుకుని కిందిస్థాయి దాకా ఎంతో చర్చ జరగాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో లాగా బీజేపీలో అర్ధరాత్రి, ఒకరిద్దరు కూర్చుని నిర్ణయాలను తలకిందులు చేయడం అసాధ్యం.
ఇక పార్లమెంటు విభజన బిల్లు పాస్ చేసినా రాష్ట్రపతి ఆపేస్తారనేది మరో అసంబద్ధ వాదన.
2004లో టీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణ అనుకూల విధానం తీసుకున్నపుడు ప్రణబ్ రాష్ట్రపతి కాడు. ఆయనకు తెలిసే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఇప్పుడు కూడా ప్రణబ్కు చెప్పకుండా సోనియా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని అనుకోగలమా?
ఘటనాఘటన సమర్థుడు, పూర్వాశ్రమములో అనేక మాయోపాయముల ఆరితేరిన రాజకీయ యోధుడు, గాంధీ కుటుంబానికి 60 ఏళ్ల అచంచల విధేయుడు, రాహుల్కు గురుతుల్యుడు అయిన ప్రణబ్, తనను అత్యున్నత స్థానానికి చేర్చిన సోనియా నిర్ణయాన్ని వ్యతిరేకించి, సీమాంధ్ర నేతలు చెప్పినట్టు, వారికి నచ్చినట్టు చేస్తారా? ఒకవేళ విభజన బిల్లును ఒకసారి ఆయన వ్యతిరేకించినా, కేంద్ర కేబినెట్ రెండోసారి పంపితే ఆమోదించక తప్పని రాజ్యాంగ అనివార్యత రాష్ట్రపతిది. జీవితమంతా రైజానా హిల్స్వద్దే పెరిగి, తిరిగిన ప్రణబ్కు ఈ విషయం తెలియదనుకోగలమా?
విభజన విషయంలో సంప్రదాయాలను పాటించడం లేదని, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. నిజానికి ఈ రెండూ పరస్పర విరుద్ధ వాదనలు.
సంప్రదాయాలను పాటించడం ఎల్లవేళలా సాధ్యంకాదు. అవసరమైనపుడు ‘సంప్రదాయాలను సృష్టించాల్సి’ ఉంటుంది కూడా! సృష్టించనిదే సంప్రదాయాలు (ప్రిసిడెంట్స్) ఎలా ఏర్పడతాయి! విభజన విషయంలో రాజ్యాంగం ప్రకారం నడవాలి అంటే… ఇక అసెంబ్లీ తీర్మానం ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే ‘అసెంబ్లీ తీర్మానం చేయాలని’ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బిల్లు ముసాయిదాపై అభిప్రాయం చెబితే చాలు. అందువల్ల అసెంబ్లీని బైపాస్ చేయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అన్న వాదనే అర్థరహితం.
ఎస్సార్సీ ప్రకారమే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్నది సీమాంధ్ర నేతలు చేస్తున్న మరో డిమాండ్. ఆ లెక్కన చూస్తే, నాడు మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్రా ఎస్సార్సీ ప్రకారం రాష్ట్రం కాలేదు.
తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయితే ఏకంగా మొదటి ఎస్సార్సీ అభిప్రాయానికి విరుద్ధంగా జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?
రాజ్యాంగంలోని 371డి అధికరణం కారణంగా విభజన ఆగిపోతుందనేది మరో వాదన. మన రాజ్యాంగం పదాల్లో ఎంత ప్రజాస్వామికంగా కనిపిస్తుందో, వాక్యాంతరాల్లో (బిట్విన్ ద లైన్స్) అంత నిరంకుశమైనది. అది ఎంత సరళమైనదో (ఫ్లెక్జిబులో), అంత కఠినమైనది కూడా. ఎమర్జెన్సీ మొదలుకుని, రాష్ట్ర ప్రభుత్వాల రద్దుదాకా, రిజర్వేషన్ల కొనసాగింపు మొదలుకుని, క్యాపిటలిస్టు ఆర్థిక సంస్కరణలదాకా, అది అక్రమమైనా, సక్రమమైనా, అధికార పక్షం తీసుకున్న ఏ నిర్ణయాన్ని రాజ్యాంగం అడ్డుకోగలిగింది?
మన రాజ్యాంగంలో సమాఖ్య తత్వం ‘స్ఫూర్తి’ మాత్రమే. పూర్తిగా ఉన్నది ‘బలమైన కేంద్ర’ భావనే. దేశంపై ఢిల్లీ అధిపత్యాన్ని ప్రకటింపజేసే, హస్తిన అధికారాన్ని సుస్థిరం చేసే అన్ని సందర్భాల్లో ఢిల్లీలోని అన్ని విభాగాలూ, కాంగ్రెస్, బీజేపీ ఏకమవుతాయి. పరస్పరం సహకరించుకుంటాయి. ఢిల్లీ అధికారాన్ని ప్రశ్నించే ఏ అంశాన్నీ రాజ్యాంగమో, సుప్రీంకోర్టో, రాష్ట్రపతి భవనో, చివరికి సైన్యమో ఎంతమాత్రం ప్రోత్సహించదు. అనేక సందర్భాల్లో రుజువైన సత్యమిది. కావాలంటే చరిత్ర చదువుకోవచ్చు.
చాలా ఏళ్లుగా ప్రజలతో సంబంధాలు తెగిపోవడం వల్ల కాబోలు… ఎప్పుడూ సూటిగా, దీటుగా, ధాటిగా మాట్లాడే సీమాంధ్ర నేతల మాటల్లో ఈసారి ఎంతో గందరగోళం కనిపిస్తోంది. (తెలంగాణ) ఉద్యమాల ఆధారంగా ప్రాంతాలను విభజించకూడదు అన్నవారే, (సీమాంధ్ర) ఉద్యమం చూసైనా ప్రాంతాలను కలిపి ఉంచాలంటున్నారు.
అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కాగితాలు రాసిచ్చినవారే, తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకుందని అభ్యంతర పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ప్రామాణికంగా తీసుకోవాలన్నది వారి మరో వాదన. ఇప్పుడు తీసుకున్న పరిష్కారమూ నివేదికలోనే ఉందన్న సంగతిని వారు మరుస్తున్నారు.
విడిపోతామన్న వారిని, ‘ఛస్తే కుదరదు… కలిసే ఉండాలి’ అని సీమాంధ్ర ఎంపీలు అనడం ప్రజాస్వామికమైనపుడు, వారిరాజీనామాలను స్పీకర్ తిరస్కరించి, ఎంపీలుగా కొనసాగాల్సిందేనని ఆదేశించడం కూడా ప్రజాస్వామికమే కదా!
ఐదేళ్ల కాలానికి తన ప్రతినిధిగా ఉండాలని ఒక పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాత మధ్యలో వెళ్లిపోయే హక్కు వారికి ఉన్నప్పుడు, విడిపోయే హక్కును ముందే పొంది ఉన్న ఒక ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం నుంచి వైదొలగడం తప్పవుతుందా?
‘రాజకీయ కారణాలతోనే సోనియా ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నది’ వారి మరో ఆరోపణ. రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం కాకుండా రామరాజ్యం కోసం రాజకీయాలు చేస్తాయా?
తెలుగుజాతి సమైక్యంగా ఉంటేనే ఒక వెలుగు వెలుగుతుందని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. సమైక్యంగా 60 ఏళ్ల ప్రస్థానం సాగించాం. మరి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ప్రతి జెండా పండుగ రోజునా ఎర్ర కోట వద్ద దండ వేయించుకోగలిగామా? దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతం అమలుకు కారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములును జాతీయ నేతగా స్మరించుకునే ఏర్పాటు చేసుకోగలిగామా?
తెలుగుతెలుగో అని పలవరించిన ఎన్టీఆర్కు అందరికన్నా ముందు పార్లమెంటులో విగ్రహం పెట్టించుకున్నామా? దేశానికి ఆర్థిక జవసత్వాలు కల్పించిన పీవీ నరసింహారావుకు ఢిల్లీలో కనీసం సమాధి అయినా కట్టుకోగలిగామా? అతి పురాతనమైన తెలుగుకు అన్నింటికన్నా ముందు ప్రాచీన భాష హోదా తెచ్చుకోగలిగామా? ఆలమట్టిని ఆపగలిగామా? బాబ్లీని బద్దలు కొట్టగలిగామా? పట్టుమని నలుగురు తెలుగు జాతీయ మహా నేతలకు సముచిత సంస్మరణ కూడా సాధించుకోలేని సమైక్యం రాష్ట్రం, అన్ని ప్రాంతాల ప్రజలకు భరోసా ఇస్తుందనడం ఎలా నమ్మశక్యం?
2014 దాకా విభజనను ఆపాలని సీమాంధ్ర నాయకులు కోరడంలోనే, అప్పటికి ఎన్నికల్లో గెలిచి, పబ్బం గడుపుకుందామనే ఎత్తుగడ దాగి ఉంది.
2014 దాకా విభజనను ఆపుతామని, తర్వాత గ్యారెంటీ లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఇంతోటిదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు?
ఇన్ని అబద్ధాలతో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం ఎందుకు?
ఎన్నటికైనా తప్పని విభజనను ఎప్పుడో ఒకసారి కానిస్తే పోలా?!
– తిగుళ్ల కృష్ణమూర్తి
ఆంధ్ర జ్యోతి 25 10 2013 సౌజన్యంతో
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2013/10/25/ArticleHtmls/25102013006007.shtml?Mode=1